దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఊహించని ట్విస్ట్..!

Spread the love

దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. అందరం కలిసి ఉండాలనే ప్రతిపాదనను దువ్వాడ వాణి ముందుకు తెచ్చారు. తనను రానివ్వకుంటే కనీసం పిల్లలతోనైనా ఆయన కలిసి ఉండాలని చెప్పారు. తాము మంచివాళ్లం కాదని ఆయన చెబుతున్నారు కదా.. అవసరమైతే కండీషన్స్ రాసుకుని తమను ఇంటిలోకి అనుమతించాలని, అందరం కలిసి ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు.

 

ఒక కూతురు పెళ్లైందని, మరో కూతురు పెళ్లికి ఎదిగిందని గుర్తు చేస్తూ సమాజంలో నిలబడాలంటే తాము ఆయనతో కలిసి ఉండటమే సరైందని దువ్వాడ వాణి అన్నారు. తనకు ఆయన ఆస్తులు, రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం కలిసి ఉండాలని మాత్రమే తాను కోరుతున్నానని చెప్పారు. అవసరమైతే కండీషన్స్ రాసుకుని తమను లోనికి అనుమతించాలని, ‘నాకు ఒక్క రూపాయి ఇవ్వనని, రాజకీయంగానూ ఎలాంటి సంబంధం ఉండదని, నాతో ఎలాంటి సంబంధాలు ఉండవని రాసుకోనివ్వండి. పిల్లలకు కూడా ఒక్క రూపాయి ఇవ్వనని ఆయన కండీషన్లు రాసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఏ కండీషన్లు పెట్టినా సరే నాకు సమ్మతమే. మమ్మల్ని ఆయనతో ఒకే ఇంటిలో ఉంచుకుంటే చాలు’ అని వాణి వివరించారు.

 

ముందుగా వారే తమపై కేసు పెట్టారని, అందుకు సంబంధించిన నోటీసులు వచ్చాయని వాణి తెలిపారు. వారు కేసు పెట్టినప్పుడు లీగల్ ప్రొసీడ్ కావాల్సే ఉంటుంది కదా అని వివరించారు. అయితే.. దువ్వాడ శ్రీనివాస్ డైవర్స్ పిటిషన్ వేశారని, అందుకు సంబంధించిన నోటీసులు అందాయా? అని అడగ్గా.. తనకు అందలేవని వాణి వివరించారు. తాను 29 ఏళ్లు ఎంతో త్యాగం చేశానని, కానీ, తనకు ఏమీ దక్కలేదని చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంత బ్లైండ్‌గా ఉన్నారని తాను అనుకోలేదని, తాను ఎంతో నష్టపోయానని వివరించారు. అయినా.. తనకు ఆయన నుంచి ఆస్తులు, రాజకీయాలు అవసరం లేదని, పిల్లల భవిష్యత్ కోసం అందరం కలిసి ఉండాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని వివరించారు.

 

దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో క్లోజ్‌గా ఉంటున్నారని, ఎఫైర్ ఉన్నదనే అనుమానంతో వాణి, ఆమె బిడ్డలు ఇంటి ముందు బైఠాయించారు. దీంతో మాధురి, శ్రీనివాస్‌లు ఆ తర్వాత స్పందించారు. శ్రీనివాస్‌తో తాను కలిసి ఉంటున్నానని, వాణి తనపై తీవ్ర ఆరోపణలు చేసి తన కుటుంబం నుంచి దూరం చేసిందని మాధురి మీడియాకు తెలిపారు. వాణితో తాను కలిసి ఉండటం లేదని, మాధురి, తాను కలిసి ఉంటున్నామని శ్రీనివాస్ కూడా చెప్పారు. ఆ తర్వాత మాధురి రోడ్డు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కూడా సంచలనమైంది. తాను దువ్వాడ శ్రీనివాస్‌ తో ఒక ఫ్రెండ్‌గా కలిసి ఉంటున్నానని చెబుతున్నారు. ఇప్పుడు వాణి తన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ వివాదం ఎటు మళ్లుతుందో చూడాల్సి ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *