మూసీ నదీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ మహానగరంలో అధికారుల బృందం నిద్రహారాలు మాని ప్రతీ ఇంటికి వెళ్లి మూసీ పరివాహిక ప్రాంతంలో, మూసీ నదిలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారని సీఎం అన్నారు.
విధిలేని పరిస్థితుల్లో దుర్భరమైన, దుర్గంధమైన ప్రదేశాల్లో జీవితాలను గడుపుతున్న పేద ప్రజలను కలిసి వాళ్ల సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. బాధితులను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచిస్తోందన్నారు. ఇందుకు అయ్యే ఖర్చుకు సైతం వెనకాడకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని, దీన్ని తెలంగాణ వాసులకే చెందేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని సీఎం గుర్తు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, ఈ మేరకు అదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యువతకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీయల్ సెక్టార్ ను బలోపేతం చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ బీజేపీల బురద…
పేదల కోసం తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీలు తమపై బురద జల్లుతున్నాయని సీఎం ఆగ్రహించారు. సర్కారు విధానాలపై ఆయా పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారమని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.