ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. ఆ అంశాలపై ఫోకస్…

Spread the love

మరో వారంలో తెలంగాణలో మంత్రివర్గం భేటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు అక్టోబర్ 23న కీలక అంశాలే ఎజెండాగా ముందుకు సాగనుంది. ఈ క్రమంలోనే హైడ్రా పాత్రతో పాటు కార్యచరణ, రైతు భరోసా, నూతన రెవెన్యూ చట్టం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది.

 

అసెంబ్లీ సమావేశాలు అప్పుడే…

 

హైడ్రా (Hydra) ఆర్డినెన్సుకు చట్టబద్ధత, కొత్త రెవెన్యూ చట్టం, మూసీ ప్రక్షాళన, బాధితులకు న్యాయం, పరిహారం, పునరావాసం, వరద నష్టం, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇందుకు ఆయా శాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు రిపోర్టులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యచరణ చేస్తోంది.

 

జోరందుకున్న హైడ్రా…

 

మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాపై చర్చ ఊపందుకుంది.

నాలా, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ లాంటి అంశాలతో చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులను కూల్చేస్తూ హైడ్రా అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది. ఇక పేదలు ఇళ్లు కోల్పోతున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపైనా ప్రభుత్వం కౌంటర్లకు సిద్ధమవుతోంది.

 

సూపర్ పవర్ హైడ్రా…

 

తాజాగా ప్రభుత్వం హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారులన్నీ హైడ్రాకు బదిలీ అయ్యాయి.

 

27 మున్సిపాలిటీల్లో హైడ్రాదే హవా…

 

జీహెచ్ఎంసీ యాక్టు 1955 కింద అధికారాలను హైడ్రాకు ఇస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, విపత్తు నిర్వహణ చర్యలు లాంటి బాధ్యతలు హైడ్రాకు సమకూరాయి. ఇక గ్రేటర్ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు లాంటి ఆస్తులను ఎవరూ ఆక్రమించకుండా రక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *