దేశంలో వరుస రైలు ప్రమాదాలు.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం..!

Spread the love

దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువకముందే.. తాజాగా గురువారం అస్సాంలో మరో రైలు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తాలా నుంచి ముంబైకి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.

 

అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3.55 గంటలకు జరిగిన ఈ రైలు ప్రమదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. పవర్ కార్, ఇంజిన్ తోపాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయని తెలిపారు.

 

 

అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

కాగా, ఈ రైలు ప్రమాద ఘటనతో లుమ్‌డింగ్ – బాదర్‌పూర్ సింగిల్ లైన్ హిల్ సెక్షన్ లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైలు అధికారులు తెలిపారు. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

అయితే, పలు రైలు మార్గాల్లో కొందరు దుండగులు రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు, ఇనుపరాడ్లు, సిలిండర్లు పెట్టి పెను ప్రమాదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుండటం గమనార్హం. ఈ ఘటనలపై కేంద్రం, రైల్వే శాఖ సీరియస్‌గా తీసుకున్నాయి. కొన్ని ఘటనల్లో నిందితులను అరెస్ట్ చేశాయి. మరోవైపు, ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్లపై కొందరు దుండగులు తరచూ రాళ్ల దాడులకు పాల్పడుతుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *