ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన..! నెలాఖరు లోగా..

Spread the love

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ గోషామహల్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మూసీ ప్రభావిత ప్రాంతంలోని 144 మంది లబ్ధిదారులకు మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు.

 

ఆర్భాటాలకు దూరంగా..

బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనైనా, ఉద్యోగాల్లోనైనా, ప్రాజెక్టుల్లోనైనా కేవలం రాజకీయ అర్భాటంతో సరిపెట్టారని పొంగులేటి విమర్శించారు. తమ ప్రభుత్వం అసంపూర్తి ఇళ్లను పూర్తి చేయించడంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నప్పటికీ పేదల పథకాల విషయంలో రాజీ పడటంలేదన్నారు. దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు ముందే ఇళ్లు ఇస్తున్నామన్నారు.1లక్ష 50వేల ఇళ్లకు టెండర్లు పిలిచామని, 98వేల ఇండ్లు కట్టామని, 40వేల ఇండ్లు పంపిణీ చేశామని, ఇంకా 58వేలు పంపిణీ చేయాల్సివుందని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం చూపించుకోవడానికే వాడుకుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *