రాజకీయాల్లో ప్రియాంక్ గాంధీ అధికారిక ఎంట్రీ.. వయనాడ్ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలు..

Spread the love

కాంగ్రెస్ పార్టీ జెనెరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం అక్టోబర్ 23, 2024న వయనాడ్ ఉపఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీకి తోడుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు సమయంలో అక్కడే ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిశాక వయనాడ్ లో కాలపెట్ట కొత్త బస్ స్టాండు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక రోడ్ షోలో పాల్గొన్నారు.

 

ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడంపై కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ మాట్లాడుతూ.. “ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెడతారని కాంగ్రెస్ పార్టీలో అందరికీ నమ్మకముంది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేఠీలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఎంత అభిమానం ఉందో.. కేరళ వయనాడ్ ప్రజల్లో కూడా అంతే అభిమానం ఉంది. ప్రియాంక రాజకీయాలకు కొత్త కాదు. ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. కానీ రాష్ట్రంలో అగ్రనాయకులు ఉండడం ప్రజల్లో ప్రభావం చూపుతుంది ” అని అన్నారు.

 

ఎన్నికల కమిషన్ వారం రోజుల క్రితమే వయనాడ్ ఉపఎన్నికలకు నోటిషికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ (52)ని ప్రకటించింది. ఈ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ విజయం సాధిస్తే.. ఆమె కేరళ నియోజకవర్గం నుంచి పార్లమెంటులోకి అడుగుపెడతారు. రాజకీయాల్లో ప్రవేశించిన అయిదేళ్ల తరువాత ప్రియాంక గాంధీ ఎన్నికల పోటీలో పాల్గొనడం ఇదే తొలిసారి.

 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్వయంగా తమ నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో వయనాడ్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రకటన రాగానే ఆమె పోస్టర్లుతో వయనాడ్ మొత్తం నిండిపోయింది. వయనాడింతే ప్రియంకారీ (వయనాడ్ ప్రియమైన) అనే నినాదాలతో పోస్టర్లు వెలిశాయి.

 

మరోవైపు వయనాడ్ లో ప్రియంక గాంధీకి పోటీగా బిజేపీ తరపున నవ్య హరిదాస్ ఎన్నికల బరిలో దిగనున్నారు. ప్రియాంక గాంధీ వయనాడ్ లో గట్టిపోటీ ఎదుర్కోబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో నవ్య హరిదాస్ మాట్లాడుతూ.. “నేనొక్కటే చెప్పదలుచుకున్నా.. ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి.. వయనాడ్ నుంచి గెలవడం ఈసారి అంత సులభం కాదు. ఇంతకుముందు రాహుల్ గాంధీ తన రాయ్ బరేలీ సీటుని కాపాడుకోవడానికి వయనాడ్ ని త్యాగం చేశారు. వయనాడ్ లో వరదల కారణంగా చాలా మంది చనిపోయారు. ఆ కష్టసమయంలో పార్లమెంటులో ఈ సమస్య గురించి మాట్లాడడానికి వయనాడ్ ప్రతినిధిగా ఎవరూ లేరు. ప్రియాంక గాంధీకి ఓటు వేసినా పరిస్థితిలో మార్పు ఏమీ ఉండదు. గత అయిదు సంవత్సరాలలో రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీగా ఏమీ చేయలేదు. ఎప్పుడో ఒకసారి వయనాడ్ లో పర్యటించడం తప్ప. ఇక్కడి సమస్యలను ఆయన పరిష్కరించడానికి ప్రయత్నించలేదు” అని విమర్శలు చేశారు.

 

నవ్య హరిదాస్ ఇంతకుముందు కోజికోడ్ కార్పరేటర్ గా పనిచేశారు. ప్రస్తుతం బిజేపీ మహిళా మోర్చా జెనెరల్ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. ఇక ప్రియాంక గాంధీకి పోటీగా లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) తరపున సత్యన్ మోకేరీ పోటీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *