రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పురోగతి లభించింది. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన సురేష్.. ఈ రోజు కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. చాలా రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు లొంగిపోవడంతో.. ఈ కేసులో తర్వాత ఎలాంటి మలుపులు తిరుగుతాయోననే ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వ అధికారులపై విచక్షణారహిత దాడి, ఏకంగా కలెక్టర్ పై కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డ నిందితుల్లో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే.. వారిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి సైతం.. పోలీసుల కస్టడీలోనే ఉండడం, ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో కేసులో మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అసలు వీరిద్దరు.. దాడి జరిగిన రోజు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు. ఏఏ విషయాలపై తరుచూ మాట్లాడుకున్నారు. దాడికి ఏమైనా ప్లాన్ చేశారా వంటి విషయాలతో పాటు అనేక అంశాలపై విచారణ జరపనున్నారు.