ప్రధాని మోదీ వైఖరిపై నిరసన.. రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్‌రెడ్డి..

Spread the love

ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును మోదీ సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. 75 ఏళ్లపాటు కష్టపడి కాంగ్రెస్ దేశం పరువు పెంచిందన్నారు. అదానీ అంశాన్ని లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.

 

అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని పదేపదే డిమాండ్ చేస్తోందన్నారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆయా అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రధాని మోదీ సైలెంట్ గా ఉండటాన్ని తప్పుపట్టారు. వ్యాపారం చేసేందుకు అదానీ లంచాలు ఇచ్చారని అమెరికన్ దర్యాప్తు సంస్థ తేల్చిందన్నారు. అయినా అదానీని మోదీ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు.

 

అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్ల వ్యవహారంపై మోదీ సర్కార్ వైఖరిపై నిరసన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ పిలుపు మేరకు చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ ప్రదర్శనగా రాజ్‌భవన్‌కు వెళ్లారు.

 

లంచం ఇస్తేనే విదేశాల్లో పనులు జరుగుతాయన్నట్టుగా అదానీ ఉదంతం తెర మీదకు వచ్చిందన్నారు. ప్రభుత్వమే రోడ్డుపై ధర్నాకు దిగడమేంటని కొందరు అంటున్నారని గుర్తు చేశారు. తాము చేస్తున్న నిరసన కొంతమందికి నచ్చకపోవచ్చన్నారు. ఇంకొందరికి కడుపులో నొప్పి రావచ్చన్నారు.

 

రాజ్‌భవన్ కూత వేటు దూరంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడమేంటని కొందరు అనుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. అనంతరం గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందజేసింది కాంగ్రెస్ పార్టీ.

 

మోదీ – అదానీ భాయ్.. భాయ్.. దేశ్ బేచ్కే ఖాయి మలాయి అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *