మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. కీలక నిందితుడు అరెస్ట్..

Spread the love

మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఎంతవరకు వచ్చింది? ఘటన జరిగి ఆరునెలలు గడుస్తున్నా కేసు మాత్రం నత్తనడకగా సాగుతోందా? అరెస్టయిన గౌతమ్ తేజ్ గుట్టు విప్పేనా? తెరవెనుక సూత్రదారులు బయటకు వస్తారా? అదే జరిగితే వైసీపీ కీలక నేతల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.

 

మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

 

బంగారు పాళ్యం సమీపంలో గౌతమ్‌ని అదుపులోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. ఆ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అతడికి జనవరి 10 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. ఆ తర్వాత చిత్తూరు జైలుకి నిందితుడ్ని తరలించారు.

 

గౌతమ్ తేజ్‌ను కస్టడీకి తీసుకోవాలని భావిస్తోంది సీఐడీ. దీనికి సంబంధించి డీటేల్స్ రెడీ చేస్తున్నారు అధికారులు. గౌతమ్ నోరు విప్పితే ఈ కేసు ఓ కొలిక్కి రావచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. రేపో మాపో కస్టడీ పిటిషన్‌ను వేయాలని ఆలోచన చేస్తున్నారు.

 

నిందితుడు గౌతమ్ తేజ్ ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. కారుణ్య నయామకం కింద ఉద్యోగం సంపాదించాడు. తొలుత చిత్తూరు కలెక్టరేట్‌లో పని చేశాడు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో పలమనేరుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వచ్చాడు. రెండేళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు.

 

మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో పత్రాలు దహనం వెనుక కీలకంగా మారాడు గౌతమ్ తేజ్. ఎందుకంటే ఘటన జరగడానికి ముందు ఏడు లీటర్లు ఇంజన్ ఆయిల్‌ను బీరువాలో భద్రపరిచాడు. మంటలకు ఇంజన్ ఆయిల్‌ తోడు అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

 

ఆఫీసులో గౌతమ్ సీటు పక్కనే ఆల్మరాలో లక్షన్నరకుపైగా నగదు పోలీసులు సీజ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో పైస్థాయి అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగాడు. ప్రస్తుతం చిత్తూరు జైలులో ఉన్నాడు.

 

పత్రాల దహనం కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనుచరుల పాత్రపై సీఐడీ తీగ లాగితే డొంకంతా కదులుతోంది. మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారిలో మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ చలపతి, గౌతమ్ తేజ్, పాత ఆర్డీవో మురళి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారాంతోపాటు మరో నలుగురు వైసీపీ నేతలున్నారు. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన అధికారులకు పలు దస్త్రాలు లభించాయి. వాటి ఆధారంగా గౌతమ్‌ను విచారించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *