జనసేన నేత నాగబాబుకు వరించే మంత్రి పదవి గురించి, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి వరించేందుకు ఇంకా 3 నెలలు పడుతుందని చెప్పకనే చెప్పారు పవన్. అంతేకాదు రాష్ట్రంలో నెక్స్ట్ తన ప్లాన్ ఏమిటో కూడా పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పారు. తాజాగా పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టాక్ గా మారాయి.
డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం చిట్చాట్ గా మీడియాతో మాట్లాడారు. పవన్ మాట్లాడుతూ.. తన సోదరుడి హోదాలో నాగబాబుకు మంత్రిగా ఛాన్స్ లభించడం లేదన్నారు. పార్టీ స్థాపించిన సమయం నుండి పార్టీ కోసం నాగబాబు పని చేశారని, ఆ స్థాయిలో ఎవరున్నా పదవి ఇవ్వడం ఖాయమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, న్యాయం చేయాల్సిన భాద్యత పార్టీ అద్యక్షుడిగా తనపై ఉంటుందన్నారు.
తన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఏ కులమో కూడా తనకు తెలియదని పవన్ అన్నారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత ఉన్నా, నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినంటూ తెగేసి చెప్పారు. ఇక నాగబాబు మంత్రి పదవి గురించి మాట్లాడిన పవన్.. మార్చి నెలలో నాగబాబు మొదటగా ఎమ్మెల్సీ అవుతారన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక తప్పక కేబినెట్ లోకి తీసుకుంటామని పవన్ తెలిపారు.
పెద్ద స్కెచ్ వేసిన పవన్..
ఏపీలో మాజీ సీఎం జగన్ వచ్చే నెల నుండి జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెల్సిందే. అయితే పవన్ కూడా ఇక జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. అది కూడా ఏకంగా నెలలో 14 రోజులు జిల్లాలకు వెళుతున్న పవన్, ఈసారి పార్టీ క్యాడర్ ను కూడా స్వయంగా కలవనున్నారు. ఓ వైపు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, మరోవైపు పార్టీని బలోపేతం చేయడం పవన్ ప్లాన్ గా చెప్పవచ్చు.
6 నెలల్లో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేసేందుకు పవన్ సిద్దమవుతున్నారు. వైసీపీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపేందుకు జగన్ ప్లాన్ చేయగా, పవన్ కూడా జిల్లాల బాట పడుతుండగా జనవరి నెల నుండి ఏపీలో రాజకీయ కోలాహలం ఉండనుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించడంపై, పార్టీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు