జనవరి 7న కీలకం.. స్పేడెక్స్‌ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు..

Spread the love

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్‌, ఛేజర్‌ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ మొదటి ప్రయోగవేదిక నుంచి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

 

స్పేడెక్స్‌ ప్రయోగం సక్సెస్ కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతికతకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని సోమ్‌నాథ్‌ వెల్లడించారు. సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ తెలిపారు.ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. వాహక నౌక 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పేడెక్స్‌ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలి భాగమని చెప్పారు. డాకింగ్‌ ప్రక్రియకు మరో వారం సమయం పడుతుందని, జనవరి 7న డాకింగ్‌ జరిగే అవకాశం ఉందని సోమనాథ్‌ తెలిపారు

 

స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం కావడం విశేషం.స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్‌ చేయించడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం.చంద్రుడిపై వ్యోమగామిని దించడం, చంద్రుడు నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే… ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *