వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్..

Spread the love

వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు.

 

విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ ఉంది. ఈ రహదారిలో నిరంతరం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే దగ్గరలోని షీలానగర్ జంక్షన్‌కు 6 లైన్ల రహదారిని విస్తృత పరచాలని ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తోంది. ఈ రహదారిని అభివృద్ది పరచడం ద్వార, వైజాగ్ పోర్టుకు వెళ్లే వాహనాలు అతి త్వరగా తమ గమ్యానికి చేరుకుంటాయి. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన జారీ చేశారు.

 

విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ 6 లైన్ల హైవే నిర్మాణం కోసం ₹963.93 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 12.66 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సబ్బవరం గ్రామానికి తూర్పు వైపున ప్రారంభమై షీలానగర్ జంక్షన్‌లోని ప్రస్తుత పోర్టు రోడ్డులో గెయిల్ కార్యాలయం దగ్గర ముగుస్తుందన్నారు. ఈ రహదారి అభివృద్ది చేయడం ద్వార, ట్రాఫిక్ అంతరాయాలను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు. షీలానగర్ – ఆనందపురం ట్రాఫిక్‌ను వేరు చేయడం ద్వారా విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ గణనీయంగా పెంచుతుందని గడ్కరి అన్నారు.

 

ఈ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ విశేషమైన పురోగతిని సాధిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. తాజాగా రహదారిని విస్తరించడం ద్వార, వైజాగ్ వాసుల కల నెరవేరిందని పవన్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *