తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపివేతపై బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూనే బీర్లు సరఫరా చేశామని పేర్కొంది. ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)ను అనేకసార్లు కోరామని తెలిపింది. టీజీబీఎల్ నుంచి రావాల్సిన బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని పేర్కొంది.
బీరు తయారీ ముడిసరుకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమే. అందులో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉంటాయి. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. నష్టాలతో వ్యాపారం చేయలేకనే తెలంగాణ రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు యూబీఎల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
టీజీబీసీఎల్కు సరుకు సరఫరా చేయలేమని యూబీఎల్ తేల్చి చెప్పింది. రెండేళ్ల నుంచి రూ. 702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ విడుదల చేయలేకపోవడం, బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యూబీఎల్ తెలిపింది. ఈ మేరకు యూబీఎల్ ప్రతినిధులు అబ్కారీ శాఖ డైరెక్టర్ సీహెచ్ హరికిరణ్ను నాంపల్లిలోని అబ్కారీ భవన్లో కలిసి లేఖ అందించారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా కలిశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆరు బీర్ల తయారీ సంస్థలున్నా.. మార్కెట్లోి వచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్దే కావడం గమనార్హం. యూబీఎల్ నిర్ణయంతో రాష్ట్రంలో బీర్ల విక్రయాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం టీజీబీసీఎల్ దగ్గర 14 లక్షల బీరు కేసుల స్టాక్ ఉంది. రాష్ట్రంలో నెలకు సగటున 40 లక్షల కేసుల వినియోగం జరుగుతోంది. దీంతో ఈ స్టాక్ వారం పది రోజుల్లో అయిపోయే అవకాశం ఉంది.
కాగా, యూబీఎల్ వ్యవహారంలో ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. మద్యం ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జీతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరామని, అది వచ్చిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల విక్రయాలు నిలిపివేస్తామని యూబీఎల్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ (UB) కంపెనీ కోరుతోందన్నారు. ధరలు పెంచితే మద్యం కస్టమర్లపై భారం పడుతుందన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని చెప్పారు. యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేరు 69 శాతంగా ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా దాదాపు రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు, బకాయిలు పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాటికి నెలకు రూ. 6 వేల కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. మరో రూ. 40 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఇందులో ఎక్సైజ్ శాఖకు సంబంధించి రూ. 2500 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 1139 కోట్ల బకాయిలు చెల్లించామని, ఇవాళ్టి వరకు మొత్తం రూ. 658 కోట్లు పెండింగ్ ఉందని మంత్రి జూపల్లి వివరించారు.
యూబీ బీర్లకు సంబంధించి రాష్ట్రంలో ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో బీరు రూ. 190, ఏపీలో 180, తెలంగాణలో 150, తమిళనాడులో 150గా ఉందని తెలిపారు. యూపీ కంపెనీ ఒత్తిడికి లొంగమని.. భవిష్యత్తులోనూ మిగితా రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉండేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.