తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా ఇ-కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ను ఎదుర్కొంటోన్నారు మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇప్పటికే ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టు సైతం దీనిపై విచారణకు నిరాకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా- ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ ఉదయం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఇ-కార్ రేస్లో అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన వివరాలు, ఇతర అంశాలపై విచారణ చేపట్టారు ఈడీ అధికారులు.
ఫార్ములా ఇ- కార్ రేస్ నిర్వాహకులకు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను పౌండ్ల రూపంలో హెచ్ఎండీఏ చెల్లించిందని, ఇది మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందనేది అధికారుల వాదన.
దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం రాలేదు. క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీనితో దాన్ని వెనక్కి తీసుకోవాల్సొచ్చిందాయనకు. ఈ పరిణామాల మధ్య ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం చర్చనీయాంశమైంది.
దీన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆందోళన చేపట్టారు. అక్కడే బైఠాయించారు. ఈడీ అధికారులు, కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ నినదించారు. పరిస్థితి అదుపు తప్పుతోండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.