పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి జరిగే అవకాశం ఉంది. సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రెండు విడతలుగా జరిగే ఈ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి.
ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వనున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎప్పటిలాగే వేతన జీవులు తమకు ఏదైనా ఉపశమనం లభిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి పన్ను చెల్లింపుదారులకు ఊరటనివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగి, వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వేతన జీవులకు ఊరట కలిగిస్తే.. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి, ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ.. 2024-25లో 6.4 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెల్లడించింది. ఆర్బీఐ కూడా 6.6 శాతం వృద్ధిని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టొచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు, కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను రూ.75,000కు కేంద్రం పెంచింది. ఈ మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లేదంటే, కొత్త పన్ను విధానంలో ఉన్న ప్రస్తుత ట్యాక్స్ శ్లాబులను సవరించే అవకాశం కూడా ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12-15 లక్షలు ఆర్జిస్తున్న వారికి ప్రస్తుతం 20 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ శ్లాబును రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలకు లేదా రూ.20 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఎలా ఉన్నా.. ఈ బడ్జెట్లోనైనా తమకు ఊరట లభిస్తుందని వేతన జీవులు మాత్రం ఎంతో ఆశగా చూస్తున్నారు.