గోపనపల్లి‌లో కొత్తగా మరో ఐటీ సెంటర్..! సీఎం రేవంత్‌తో చర్చలు..

Spread the love

హైదరాబాద్‌లో విప్రో ఐటీ కంపెనీ తమ క్యాంపస్‌ను విస్తరించనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి‌లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షం, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు.

 

అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తికానుంది.

 

ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ఉంటుందన్నారు. వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉంటామన్నారు.

 

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి రేవంత్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆ కంపెనీని ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *