దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకూ పెట్టుబడుల సాధన విషయంలో ఎలాంటి హామీలు తెచ్చుకోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజ సంస్థ తమ విస్తరణ వ్యూహాల్లో భాగంగా ఏపీకి రానున్నట్లు లోకేష్ సంకేతాలు ఇచ్చారు.
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ తమ అభివృద్ధి, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న టైర్ 1 నగరాల నుంచి టైర్ 2 నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతిలో విస్తరణకు అవకాశాలు ఉన్నట్లు కాగ్నిజెంట్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీనిపై వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు లోకేష్ వెల్లడించారు. ఈ మూడు నగరాల్లో 2.2 లక్షల చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉన్నట్లు కాగ్నిజెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో టైర్ 1 నగరాల్లో పనిచేస్తున్న 80 వేల మంది ఉద్యోగుల్ని టైర్ 2 నగరాలకు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంస్థ సీఈవో రవికుమార్ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో నారా లోకేష్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆయన్ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కాగ్నిజెంట్ సీఈవో.. త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కాగ్నిజెంట్ నుంచి గుడ్ న్యూస్ రాబోతున్నట్లు లోకేష్ హింట్ ఇచ్చారు.