తెలంగాణలో ఆ జనాభానే ఎక్కువ.. కులగణన సర్వే వివరాలు వెల్లడించిన మంత్రులు..

Spread the love

తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో కులాల వారీగా వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులగణన సర్వే విజయవంతం అయ్యిందని రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులాల వారీ జనాభా లెక్కల వివరాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా .. కులగణనను సంబంధించిన సమగ్ర సర్వే వివరాలను మంత్రి వర్గ ఉపసంఘానికి సమర్పించారు. ఈ నివేదికపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. అనంతరం మీడియాతో సర్వేకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.

 

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. దేశంలోని దశాబ్దాలుగా జనగణన జరుగుతుంది కానీ, కుల గణన జరగడం లేదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ప్రజల్లో సామాజిక వర్గాల అంతరాలు రూపుమాపేందుకు, వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నట్లు తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది ప్రజలు వివరాలు అందించారని, ఇది 96.9 శాతానికి సమానమని వెల్లడించారు. మిగతా 16 లక్షల మంది అంటే.. 3.1 శాతం మంది తెలంగాణ ప్రజలు వివిధ కారణాలతో వివరాలు అందించలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేను అడ్డుకోవాలని రాష్ట్రంలో చాలా దుష్ట శక్తులు ప్రయత్నించాయని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అధికారులు సమర్థవంతంగా కులగణనను పూర్తి చేశారని తెలిపారు.

 

ప్రస్తుతం మంత్రి వర్గ ఉపసంఘం దగ్గరు వచ్చిన నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించి.. ఈ నెల 4న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కేబినెట్‌లో చర్చించిన తర్వాత రాష్ట్ర శాసన సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *