గురువారం ఉదయం జగన్ మీడియా సమావేశం నిర్వహించి, గతం కంటే భిన్నంగా ఓ రేంజ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలు గుప్పించి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారంటూ జగన్ అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తారని, ఆరోజు కూడా త్వరలో రాబోతుందంటూ జగన్ జోస్యం చెప్పారు. ఇలా జగన్ విమర్శలు గుప్పించడంలో నిమగ్నం కాగా.. ప్రభుత్వ మాత్రం తన పని తాను చేసిందని చెప్పవచ్చు.
ఏపీ కేబినెట్ సమావేశం గురువారం నిర్వహించి.. వరుస శుభవార్తలను ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు జగన్ విమర్శలు.. మరోవైపు ప్రభుత్వం నుండి ప్రజలకు శుభవార్తలు అందడంతో ఏపీ పొలిటికల్ పీక్స్ కి చేరిందని చెప్పవచ్చు. గతంలో జగన్.. ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచబోతున్నట్లు ఆరోపణలు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. అయితే గురువారం సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఓ క్లారిటీ ఇచ్చేశారు.
విద్యుత్ చార్జీలను ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని, ఇంకా తగ్గించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు. దీనితో ఏపీలో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై ఉండదన్న క్లారిటీ వచ్చేసింది. అలాగే ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటినుండి విద్యార్థులకు సన్నబియ్యంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. అంతేకాకుండా తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుండి వచ్చిన ఈ మూడు ప్రకటనలు వైసీపీని ఇరకాటంలో పెట్టాయని చెప్పవచ్చు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని జగన్ చెబుతున్న క్రమంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించడంతో కాస్త వైసీపీ క్యాడర్ సైలెంట్ అయింది. ఏదిఏమైనా విదేశాల నుండి వచ్చిన జగన్ కాస్త స్పీడ్ పెంచగా, అంతే స్పీడ్ గా తిప్పికొట్టాలని కూటమి ప్రయత్నిస్తోంది.