తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం ..

Spread the love

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ ద్వారా నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు సినిమా దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం (ఫిబ్రవరి 6) హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, సినీ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 6 వ తేదీని తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించారు. ఇకపై ప్రతి ఏటా ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినీ నటుడి ఇంటిపైనా, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పుట్టిన రోజు జెండా రూపకల్పన బాధ్యతను ఫిలిం ఛాంబర్ పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది.

 

ఈ కార్యక్రమంలో మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుందన్నారు. రాజకీయ నాయకులకు పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రజల్లో ఆదరణ ఉండదని అన్నారు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమేనన్నారు. సినీ నటులు మాత్రం ఎల్లప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారన్నారు. మద్రాస్‌లో ఉన్న సమయంలో తామంతా సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమని అన్నారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని మురళీమోహన్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *