తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆలస్యం చేయకుండా కొత్త రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సోమవారం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నూతనంగా దరఖాస్తులు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో మీ-సేవా కేంద్రాలకు ప్రజలకు జనం క్యూ కడుతున్నారు. గత రెండ్రోజుల నుంచి మీ-సేవా కేంద్రాల దగ్గర రద్దీ నెలకొంటోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా జాబితాలో తమ పేర్లు రాలేదని మీ-సేవా కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి వారికి అధికారులు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రజాపాలన, ప్రజావాణి సమయంలో దరఖాస్తులు ఇచ్చిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్ చేయబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 6.68 లక్షల నిరుపేద కుటుంబాలను కొత్త రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించింది. వీరి జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులకు పంపారు. ఆ కుటుంబాల జాబితాలో 11,65,052 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. జనవరి 20 నుంచి 24 వరకు అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం గ్రామ, బస్తీ సభలను నిర్వహించింది. అ తర్వాత జనవరి 26న రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.