కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గురువారం ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత కారణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెగ్యూలర్ చెకప్లో భాగంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
సోనియా గాంధీ బాగా కోలుకుంటున్నారని, శుక్రవారం సాయంత్రం నాటికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కాగా, గత డిసెంబర్లో తన 78వ పుట్టినరోజు జరుపుకున్నారు సోనియా గాంధీ.
Sonia Gandhi admitted to hospital in Delhi
గురువారం సోనియా గాంధీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. పీటీఐ కథనం ప్రకారం.. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
‘ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమె ఆసుపత్రిలో చేర్చారు. అయితే, పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు. శుక్రవారం ఉదయం నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆమె డాక్టర్ సమిరాన్ నంది సంరక్షణలో ఉన్నారు’ అని సర్ గంగా రామ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
గతంలో అనారోగ్య కారణాల వల్ల 2024 డిసెంబర్ నెలలో కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియా గాంధీ హాజరుకాలేదు. గత సెప్టెంబర్ నెలలో కూడా సోనియా గాంధీ అనారోగ్య కారణంగా సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత పూర్తిగా కోలుకుని రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోనియా గాంధీ చివరిసారిగా ఫిబ్రవరి 13న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బహిరంగంగా కనిపించారు