రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు పలు జిల్లాలలో జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కావడం విశేషం.
మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియను సైతం నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈనెల 29 తో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని చెప్పవచ్చు. మార్చి 10 నుండి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13వ తేదీ వరకు గడువు ఉంటుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకటనలో వివరించారు.
ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావులు, తెలంగాణలో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ల పదవీకాలం ఈనెల 29 తో ముగియనుందని ఎన్నికల కమిషన్ ప్రకటన జారీ చేసింది. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు. ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా, టీడీపీ కి 2, జనసేనకు 2, బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనితో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా, మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది. త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా, అంతలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ నాయకులు మార్చి నెలలో పదవుల జాతర జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏపీ, తెలంగాణలో ఖాళీగా ఈ స్థానాలకు ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి.
తమ్ముడూ.. టైమ్ వచ్చింది
జనసేన పార్టీలో మరో కీలక నేత నాగబాబుగా చెప్పవచ్చు. పవన్ తర్వాత నెంబర్ – 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఆల్ రెడీ మంత్రిగా ఉన్నారు. ఇక తననే నమ్ముకున్న అన్న నాగబాబుకు పదవి కట్టబెట్టేందుకు పవన్ సిద్దమయ్యారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబుకు అవకాశం కల్పించి, కేబినెట్ లోకి తీసుకోవాలన్నది కూటమి ప్లాన్. అందుకే రావాల్సిన ప్రకటన రావడంతో, నాగబాబుకు మంత్రి పదవి వరించే అవకాశాలు సమీపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.