చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోస్ మూవీస్ తోపాటు పలు యాడ్స్ లోనూ నటించడం అందరికీ తెలిసిన విషయమే. అటు సినిమా.. ఇటు యాడ్స్ తో కోట్లలో సంపాదిస్తుంటారు సెలబ్రిటీలు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోస్ పాన్ మసాలా యాడ్ లో కనిపిస్తున్నారు. వీరిపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. కానీ బాలీవుడ్ స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, టైగర్ ష్రాప్ లు అవి కొనసాగిస్తూనే ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు కేసరి పాన్ మసాలా.. ఇలాచీ బ్రాండ్ పై యాడ్స్ ఇస్తున్నారు. బోలో జుబాన్ కేసరీ అంటూ ఈ సెలబ్రిటీల యాడ్ ఉంటుంది.
అయితే తాజాగా స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, టైగర్ ష్రాప్ లపై రాజస్థాన్ లోని కోటాలోని కజ్యూమర్ కోర్టులో ఫిర్యాదు నమోదు చేశారు. కథనాల ప్రకారం నవభారత్ టైమ్స్.. అనే సంస్థ ఈ కంప్లయింట్ ఫైల్ చేసినట్లు సమాచారం. ఇదే సంస్థకు చెందిన మోహన్ సింగ్ హనీ.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, టైగర్ ష్రాఫ్ లపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ తమ ప్రకటనలతో యువతకు తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ సింగ్.
షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, టైగర్ ష్రాప్ లు యువతను చీట్ చేస్తున్నారని.. పాన్ లో కుంకుమ పువ్వు ఉందని యువతను మోసగిస్తున్నారు.. కానీ అలాంటిదేమీ ఆ పాన్ మసాలాలో లేదని ఫిర్యాదుదారుడు మోహన్ సింగ్ తరఫు న్యాయవాది వివేక్ నందవాన్ పేర్కొన్నారు. పాన్ మసాలా ప్యాకెట్ పై వార్నింగ్ నోట్ చిన్న చిన్న అక్షరాలతో రాశారని.. అవి కనిపించకుండా ఉన్నాయన్నారు.
ఈ మోసపూరిత యాడ్స్ ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కజ్యూమర్ కోర్టు ఛైర్మన్ అనురాగ్ గౌతమ్, సభ్యుడు విరేంద్ర సింగ్ రావత్ లు షారుఖ్ ఖాన్,అజయ్ దేవ్ గణ్, టైగర్ లకు నోటీసులు అందించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అటు బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.