ఏపీలో లిక్కర్ వ్యవహారం..! జగన్‌కు కష్టాలు తప్పవా..?

Spread the love

జగన్‌కు కష్టాలు తప్పవా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీలు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోనుందా? లోక్ సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ప్రస్తావించడం వెనుక అసలు మతలబు ఏంటి? సీబీఐ కాకుండా నేరుగా ఈడీ విచారణకు ఆదేశించాలని ఎందుకు డిమాండ్ చేశారు? దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఎలా ఉంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

ఏపీలో లిక్కర్ వ్యవహారం

 

2019-24 వైసీపీ హయాంలో లిక్కర్ అవకతవకలపై సీఐడీ విచారణ చేస్తోంది. దర్యాప్తు ఈ కేసు రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. అప్పట్లో కీలకంగా పని చేసినవారిని సీఐడీ విచారించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు.

 

కాకపోతే సోమవారం లోక్‌సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై సీబీఐ కాకుండా నేరుగా ఈడీ దర్యాప్తు చేయాలని సభ సాక్షిగా ప్రస్తావించడంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ ఏపీలో మొదలైపోయింది.

 

లోక్‌సభలో టీడీపీ ప్రస్తావన

 

వైసీపీ హయాంలో ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. మాజీ సీఎం జగన్ తన బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ.2 వేల కోట్లు తరలించారని ఆరోపణలు చేశారు. ఓ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్‌ రెడ్డి ద్వారా మళ్లించారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో లిక్కర్ పేరిట దాదాపు 26 కొత్త కంపెనీలు లాభపడ్డాయని వివరించారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీది చాలా పెద్దదని ప్రస్తావించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల కలెక్షన్ల కన్నా లిక్కర్ కుంభకోణం పెద్దదని పేర్కొన్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, నాసిరకంగా ఉన్నబ్రాండ్లను ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ లిక్కర్ స్కాం వల్లే ఓ ఎంపీ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

దాదాపు ఈ కుంభకోణంలో రూ.4 వేల కోట్ల అక్రమాలు జరిగాయన్నది టీడీపీ సభలో వెల్లడించింది. బినామీల ద్వారా మరో రూ.4 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తు చేశారు. వీటన్నింటిపై ఈడీ చేత దర్యాప్తు చేయించాలన్నది ప్రధాన డిమాండ్.

 

కొద్దిరోజుల కిందట వీఎస్ఆర్ ప్రకటన

 

లిక్కర్ వ్యవహారంలో ఆనాటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి వేల కోట్ల రూపాయలు గండి కొట్టారనే ఆరోపణలతో కేసులు నమోదు అయ్యాయి. రీసెంట్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పని చేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇందులో పాత్రదారి, సూత్రదారి అని బాంబు పేల్చారు.

 

ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ లోక్‌సభలో ప్రస్తావించడం కూడా ఇదే బలమైన కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో రేపో మాపో కీలక పరిణామం జరిగే అవకాశముందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్టేట్‌మెంట్ చేయకుండా నేరుగా లోక్‌సభలో ప్రస్తావించడం వెనుక అటువైపు నుంచి స్కెచ్ వేసినట్టు చర్చించుకుంటున్నారు. మొత్తానికి లిక్కర్ వ్యవహారంపై కొద్దిరోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *