గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ..! ఎమ్మెల్సీ అభ్యర్థి పై చర్చ..!

Spread the love

హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను శనివారం కేంద్రమంత్రి బండి సంజయ్ కలిశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజా సింగ్‌తో కీలక చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని రాజా సింగ్ వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ రంగంలోకి దిగారు.

 

బండి సంజయ్‌తో భేటీ అనంతరం రాజా సింగ్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుపు కోసం కృషి చేస్తానని రాజా సింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలమేరకే నడుచుకుంటానని చెప్పారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లతో కో-ఆర్డినేట్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు.

 

ఈ భేటీ సమయంలోనే గౌతమ్ రావును అక్కడకు రప్పించి రాజా సింగ్‌తో కరచాలనం చేయించారు బండి సంజయ్. దీంతో రాజా సింగ్, గౌతమ్ రావు సరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజా సింగ్‌కు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. కాగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుపు కోసం పనిచేస్తానని రాజా సింగ్ చెప్పారు.

 

హైదరాబాద్‌లోని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని రాజా సింగ్ కోరారు. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలన్నారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ.. అప్పటి సందర్భం వేరని.. ఇప్పుడు తాను పార్టీ అభ్యర్థి గెలుపుపై దృష్టి సారిస్తానన్నారు. అన్ని పార్టీలో విభేదాలుంటాయని.. తమ పార్టీ తమకు తల్లిలాంటిదన్నారు రాజా సింగ్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తనతో చాలా సార్లు మాట్లాడారని.. కేంద్రమంత్రి కావడంతో ఆయన ఇప్పుడు కొంచె బిజీగా ఉన్నారన్నారు.

 

రాజా సింగ్ బీజేపీకి క్రమశిక్షణ గల కార్యకర్త అని బండి సంజయ్ అన్నారు. రాజా సింగ్ కట్టర్ బీజేపీ నేత అని వ్యాఖ్యానించారు. కాగా, తమ భేటీ సందర్బంగా ముందుగా పాతబస్తీలోని ఆకాశ్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్, రాజా సింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *