కేవలం 50 నిమిషాల్లో కేసీఆర్ విచారణ..!

Spread the love

ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కేవలం 50 నిమిషాల్లో తన విచారణను ముగించారు. బీఆర్కేభవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన కారులో నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు బీఆర్కే భవన్‌‌కు ఆయన వచ్చారు. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన 9 మంది నేతలను ఆఫీసులోకి అనుమతి ఇచ్చారు. ఆయనను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేశారు.

 

విచారణ సమయంలో కేసీఆర్ కొన్ని సూచనలు కమిషన్ దృష్టికి తెచ్చారు. తనకు అనారోగ్య కారణంగా ఇన్ కెమెరా విచారణను కోరారు. అందుకు కమిషన్ ఓకే చెప్పింది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించింది కమిషన్. కేసీఆర్‌ను వన్ టూ వన్ విచారణ చేస్తున్నారు జస్టిస్ పీసీ ఘోష్. అనారోగ్యం కారణాలతో కేవలం 50 నిమిషాల్లో విచారణ ముగించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో మీ పాత్ర ఏంటి? మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణం ఎవరు? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎందుకు చెల్లించారు? కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉందా? సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా?

 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణ వద్ద రాతి పునాది ఉందా? మేడిగడ్డ ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? వంటి అంశాలను రెడీ చేసింది. ఈ విషయాలు కాకుండా అధికారులు, మాజీ మంత్రులు ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా మరి కొన్ని ప్రశ్నలు రెడీ చేసినట్టు తెలుస్తోంది. తొలుత కమిషన్ ప్రశ్నలకు మౌనం దాల్చిన కేసీఆర్, ఆ తర్వాత నోరు విప్పారు.

 

కొన్ని ప్రశ్నలకు ఆయన ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలుస్తోంది. కమిషన్ ప్రశ్నలు ఎక్కువగా ప్రాజెక్టు రీ డిజైన్, నిర్మాణంపై ఎక్కువగా రైజ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రధానంగా కమిషన్ ప్రస్తావించిందట. అలాగే నీటి నిల్వలకు సంబంధించి వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను లేవనెత్తినట్టు సమాచారం.

 

కమిషన్ ఇప్పటివరకు 114 మందిని విచారించింది. ఫైనల్‌గా కేసీఆర్‌ను విచారించిన తర్వాత నివేదికను రూపొందించనుంది. కేసీఆర్‌కు జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. కమిషన్ అడిగిన ప్రశ్నలు మీడియాకు తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన ఆయన, ఇన్ కెమెరాను విచారణను కోరినట్టు భావిస్తున్నారు కొందరు నేతలు.

 

కేసీఆర్‌కు ముందు మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటెలను ఓపెన్‌గా మీడియా సమక్షంలో విచారించింది కమిషన్. వారిచ్చిన సమాధానాలపై రకరకాలుగా ప్రశ్నలు లేవనెత్తారు ప్రత్యర్థులు. పరిస్థితి గమనించిన కేసీఆర్, తనకు అనారోగ్యం పేరిట వన్ టు వన్ విచారణకు వచ్చినట్టు కొందరి నేతల మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *