నాకు మొదటి పార్టీ టీడీపీ… చివరిది బీజేపీ: రాజాసింగ్..

Spread the love

తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా చానళ్లలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

కొంతకాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ, కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. గతంలో తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ, తాను పార్టీ మారే ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. “అప్పుడే నేను వేరే పార్టీలోకి వెళ్లలేదు, ఇప్పుడు కూడా బీజేపీని వీడి వెళ్లను” అని ఆయన తేల్చిచెప్పారు.

 

ప్రస్తుతం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల వల్లే బీజేపీలో కొనసాగుతున్నానని, లేకపోతే ఎప్పుడో పార్టీని వీడిపోయేవాడినని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ భారతీయ బీజేపీ అని అన్నారు. ఒకవేళ పార్టీని వీడాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను తప్ప, మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్న వారిని కూడా వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *