సింధు జలాల ఒప్పందంపై కీలక ప్రకటన.. కోర్టు తీర్పు చెల్లదన్న భారత్..

Spread the love

సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA) వెలువరించిన తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తీర్పునకు ఎటువంటి చట్టబద్ధత లేదని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం తమకు లేదని గురువారం స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు జలాల ఒప్పందాన్ని ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

 

ఈ విషయంపై న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటును, దాని చట్టబద్ధతను భారత్ ఎప్పుడూ గుర్తించలేదని ఆయన తేల్చిచెప్పారు. “ఆ కోర్టు ఇచ్చిన తీర్పులకు అధికార పరిధి లేదు, చట్టపరమైన విలువ లేదు. జలాల వినియోగంపై మా హక్కులను ఆ తీర్పులు ఏమాత్రం ప్రభావితం చేయలేవు. ఈ విషయంలో పాకిస్థాన్ తప్పుదోవ పట్టించేలా చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని జైస్వాల్ అన్నారు.

 

జమ్మూకశ్మీర్‌లోని కిషన్‌గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై ఈ కోర్టు జూన్‌లో ఒక అనుబంధ తీర్పు ఇచ్చింది. అయితే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రతిస్పందనగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ సార్వభౌమ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ వివరించింది. ఒప్పందం అమలులో లేనప్పుడు, దాని కింద వచ్చే బాధ్యతలను పాటించాల్సిన అవసరం లేదని, అక్రమంగా ఏర్పడిన మధ్యవర్తిత్వ కోర్టుకు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన పాత్ర నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి కల్పిత మధ్యవర్తిత్వ నాటకాలకు పాల్పడుతోందని భారత్ ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *