ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం: సీఎం చంద్రబాబు..

Spread the love

ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్ఠ‌మైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. విశాఖలో జ‌రిగిన‌ ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వ పాలసీల గురించి వివరించారు.

 

ప్రస్తుతం దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 35 శాతంగా ఉందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటికే ‘ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఏపీ, దేశానికే ‘ఆక్వా హబ్’‌గా కూడా నిలుస్తోందని ఆయన గుర్తుచేశారు.

 

పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0’ను అమలు చేస్తోందని చంద్రబాబు వివరించారు. రూ. 200 కోట్లకు పైబడిన పెట్టుబడులను ‘మెగా ప్రాజెక్టు’లుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.

 

కేవలం పెట్టుబడులే కాకుండా, ఆవిష్కరణలకు కూడా పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో, ఆవిష్కరణల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తాయని భరోసా ఇచ్చారు.

 

మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లను అందిపుచ్చుకుంటూ, ప్రపంచస్థాయి బ్రాండ్లను భారతదేశం నుంచి తయారు చేయాలన్నదే తమ ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్ ఏర్పాటు కానుండటం సంతోషకరమని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *