జూబ్లీహిల్స్ బైపోల్‌ పై సీఎం రేవంత్ కీలక సమావేశం..!

Spread the love

తెలంగాణలో ఉపఎన్నిక వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌కు నేడో లేదా రేపో నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గం కేడర్‌తో సమావేశమైంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి ఉపఎన్నికపై దృష్టి సారించారు. ఆదివారం తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. ఈ సీటు కచ్చితంగా గెలిచి తీరాల్సిన మనసులోని మాట బయటపెట్టారు. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రతి డివిజన్‌కు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్‌లను ఇన్‌ఛార్జులుగా నియమించినట్టు తెలిపారు.

 

అందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్‌ఛార్జులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం, ప్రచారంలో ఏమైనా లోపాలుంటే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచన చేశారు.

 

పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెబుతూనే, నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ విజయం కోసం పని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

 

మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా, నేతలు, మంత్రులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని తెలిపారు. ఇటీవల చేపట్టిన పలు సర్వేల గురించి నేతలకు వివరించారు.

 

గతం కంటే మనం చాలా మెరుగయ్యామని, కేవలం సానుభూతి ఎజెండాగానే బీఆర్ఎస్ ప్రచారానికి దిగుతుందననారు. కేవలం అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాలని నేతలకు సూచనలు చేశారు. అభ్యర్థి ఎవరు అనేదానిపై కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత రావాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *