మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..!

Spread the love

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాత‌ర‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆలయ అభివృద్ధి, జాతర పనులపై స్వయంగా సమీక్షించేందుకు నేడు మేడారంలో పర్యటించనున్నారు సీఎం. మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్‌ను విడుదల చేయనున్నారు. గిరిజ‌న సంప్రదాయాలు, విశ్వాసాల‌కు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాల‌కు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టనుంది. మహా జాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.

 

మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్

ఇంతకాలం మేడారం జాత‌ర‌కు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ వచ్చాయి. జాతర నిర్వహ‌ణ‌పై స‌మీక్షకు సైతం గ‌తంలో సీఎంలు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర ఏర్పాట్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై ముఖ్యమంత్రి మేడారంలో స‌మీక్ష నిర్వహించ‌నున్నారు.

 

జాతరకు ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలు పరిశీలన

ఆదివాసీ సంప్రదాయాల‌కు పెద్ద పీట వేస్తూ ఇల‌వేల్పులు స‌మ్మక్క, సార‌ల‌మ్మ, ప‌గిడిద్దరాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్రభుత్వం శ్రీ‌కారం చుడుతోంది. కోట్లాది భ‌క్తులు వ‌చ్చే జాత‌ర ప్రాశ‌స్త్యానికి త‌గ్గట్లు భారీ ఎత్తున స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్దకు భ‌క్తులు సులువుగా చేరుకోవడం.. గ‌ద్దెల ద‌ర్శనం.. బంగారం (బెల్లం) స‌మ‌ర్పణ‌.. జంప‌న్న వాగులో స్నానాలచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌నున్నారు.

 

ప్రపంచ ప‌టంలో జాత‌ర‌కు మ‌రింత వ‌న్నె తేవాల‌ని సీఎం రేవంత్ సంక‌ల్పం..

గ‌తంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాత‌ర‌కు వెళ్లడం.. ద‌ర్శనాల‌తో స‌రిపుచ్చేవారు. మేడారం అభివృద్దిపై ఏమాత్రం శ్రద్ద వ‌హించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ ప‌టంలో జాత‌ర‌కు మ‌రింత వ‌న్నె తేవాల‌ని సీఎం రేవంత్ సంక‌ల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాత‌రను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సీఎం అధికారులను ఆదేశించారు.

 

జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై ముఖ్యమంత్రి స‌మీక్ష

రెండేళ్లకోసారి జరిగే మహా జాత‌రతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరిగింది. వీకెండ్, సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవ‌స‌ర‌మైన వ‌స‌తి, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం అభివృద్ధి ప‌నులతో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల‌కు పెద్ద పీట వేయటంతో పాటు ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కానికి ప్రభుత్వం ఊత‌మివ్వనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *