ఉస్మానియా కొత్త ఆసుప‌త్రి పనులు షురూ..!

Spread the love

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం గోషామహల్ స్టేడియంలో నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇకపై శరవేగంగా జరగనున్నాయి.

 

ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా, అత్యాధునిక సదుపాయాలతో ఈ కొత్త భవనాలను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ 2,000 పడకల సామర్థ్యంతో పలు భవనాలను నిర్మించనున్నారు. ప్రతి భవనాన్ని 12 అంతస్తులతో నిర్మించనుండగా, బేస్‌మెంట్‌లో రెండు అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

నిజాం కాలంలో నిర్మించిన పాత ఉస్మానియా ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, కొత్త భవనాన్ని నిర్మించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పనులు అధికారికంగా ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *