ఏపీలో చమురు, సహజ వాయువుల అన్వేషణకు ఓఎన్‌జీసీ భారీ ప్రణాళిక..

Spread the love

ఏపీలో చమురు, సహజ వాయువుల అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) మరింత ముమ్మరం చేయనుంది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సుమారు రూ.8,110 కోట్ల అంచనా వ్యయంతో కోనసీమ పరిధిలోని భూభాగంలో 172 కొత్త బావులను తవ్వడానికి ఓఎన్‌జీసీ రూపొందించిన ప్రణాళికకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ తాజాగా ఆమోదముద్ర వేసింది.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా కోనసీమ ప్రాంతంలో ఓఎన్‌జీసీకి కేటాయించిన ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (పీఎంఎల్) బ్లాకుల్లో ఈ తవ్వకాలు జరగనున్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ సంబంధిత కార్యక్రమాలకు మరో రూ.11 కోట్లు కేటాయించినట్టు సంస్థ తెలిపింది.

 

అయితే, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ నిపుణుల కమిటీ కొన్ని కఠినమైన షరతులను విధించింది. తవ్వే బావుల్లో ఏ ఒక్కటీ కోరంగి వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అటవీ భూములు లేదా ఇతర సంరక్షిత ప్రాంతాల గుండా పైప్‌లైన్లు వేయాల్సి వస్తే తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే కోనసీమలో చమురు క్షేత్రాల వల్ల భూమి కుంగిపోతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది.

 

కేజీ బేసిన్‌లో దాదాపు 69.8 కోట్ల టన్నుల చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓఎన్‌జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు ఇక్కడ అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. మరోవైపు, దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నప్పటికీ, చమురుకు గిరాకీ తగ్గబోదని, 2050 నాటికి డిమాండ్ దాదాపు రెట్టింపు అవుతుందని బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్‌జీసీ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *