సింగపూర్కు చెందిన మెయిన్హార్డ్ట్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు.
వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. కాగా, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణతో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోనున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టి ఉంచుకుని నమూనాలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూచించారు.
సీఎంను కలిసిన ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు
డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జాయ్ ఫోక్, మనీష్ కుమార్, అల్తాఫ్ అలీ ఖాన్, వందన కుమార్.
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు.
హైదరాబాద్లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్కు ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు.