లోక్సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్సభ పోలింగ్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అటు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇదే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా లోక్సభ స్థానాలను గెలచుకోవడానికి కసరత్తు సాగిస్తోంది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తూ వచ్చిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేసింది. మొత్తంగా 14 మంది అధికారులు బదిలీ అయ్యారు.
ఎన్నికలు సమీపించిన సమయంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ బదిలీలు సంభవిస్తుంటాయి. మొన్నటికి మొన్న రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో 395 మంది ఎంపీడీఓలను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో వారందరూ బదిలీ అయ్యారు. దీనికి కొనసాగింపుగా- ఎక్సైజ్ శాఖలో బదిలీలకు పూనుకుంది ప్రభుత్వం. మున్ముందు ఐఎఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల బదిలీలు కూడా ఉండొచ్చు.