నేటి నుంచి మేడారం జాతర ప్రత్యేక పూజలు.. మండమెలిగే పండుగ పేరుతో ఉత్సవం..

Spread the love

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. కాగా బుధవారం నుంచే ఈ జాతరకు ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. మండమెలిగే పండుగ పేరుతో జాతర ప్రారంభమైనట్లు భావిస్తారు. ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ వేడుకను పూర్తిగా ఆదివాసి సాంప్రదాయాలతో నిర్వహిస్తారు.

 

మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లో ఈ మండమెలిగే పండుగ ఉత్సవాలు జరుగుతాయి.

 

మండమెలిగే పండుగకు ప్రత్యేక చరిత్ర ఉంది. పూర్వం ప్రస్తుతం ఉన్న గుళ్ల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి ఇవి పాతపడడంతో.. అక్కడి ఆదివాసీ పూజారులు అడవికెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్ళు నిర్మించేవారు. దీన్నే మండమెలిగే పండుగంటారు. అయితే పగలంతా మండమెలిగి పూజారులు రాత్రి దేవతల గద్దెలపైన జాగారం చేస్తారు.

 

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. 21న కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెనెక్కడంతతో జాతర షురూ అవుతుంది. కాగా 22 రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెమీదకు వస్తారు. దీంతో భక్తజనం పోటెత్తుతారు. 23 రోజున అమ్మవార్లకు మొక్కుబడులు సమర్పించుకుంటారు. ఇక చివరిదైన 24న అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు జనం అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *