ఏపీలో పెన్షన్ల రచ్చ పరాకాష్ట ! పింఛన్ దారు శవం ముందే వైసీపీ వర్సెస్ టీడీపీ ..!

Spread the love

ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి వ్యతిరేకంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్ధ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఆ తర్వాత ఈసీ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మొదలైన రచ్చ పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్లర్లకు వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో ఆ పాపం మీదంటే మీదని వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలకు దిగాయి. ఇవాళ పెన్షన్ల పంపిణీ సచివాలయాల దగ్గర మొదలుకావడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.

 

దాదాపు నాలుగేళ్ల తర్వాత సచివాలయాల వద్దకు పెన్షన్ల కోసం క్యూ కట్టిన పింఛన్ దారులు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరులో పెన్షన్ కోసం బయలుదేరి వజ్రమ్మ అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో గంగూరులోని ఆమె ఇంటి వద్దకు చేరుకున్న వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు.

ఓవైపు మంత్రి జోగి రమేష్, మరోవైపు పెనమలూరు టీడీపీ అభ్యర్ధి బోడే ప్రసాద్ అనుచరులు భారీ ఎత్తున వజ్రమ్మ ఇంటికి చేరుకున్నారు. పరస్పర ఆరోపణలు, దూషణలు చేసుకున్నారు. వజ్రమ్మ శవానికి అటూ, ఇటూ నిలబడి వీరు చేసుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణలకు స్ధానికులు నిర్ఘాంతపోయారు. శవం దగ్గర కూడా రాజకీయాలా అంటూ మండిపడ్డారు. ఓ దశలో చంద్రబాబు ఇంటి వద్దకు వజ్రమ్మ శవాన్ని తీసుకెళ్లి ఆందోళన చేయించాలని కూడా జోగి రమేష్ ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు వారించారు. దీంతో దాదాపు గంటన్నర పాటు వాదోపవాదాల తర్వాత వీరంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *