బీఆర్ఎస్ కు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి.. చెయ్యి అందుకుంటున్నారు. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కారు పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్.. తెల్లం వెంకట్రావ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావ్ తో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
గతేడాది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు తెల్లం వెంకట్రావ్. ఆ తర్వాత పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉన్న ఆయన.. కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఇటీవల మణుగూరులో జరిగిన బహిరంగ సభలో.. తెల్లం వెంకట్రావ్ తమతో కలిసి నడుస్తానని చెప్పారని తెలిపారు. శనివారం జరిగిన తుక్కుగూడ జనజాతర సభకు కూడా ఆయన హాజరయ్యారు. గత నెలలో కేసీఆర్ సమావేశానికి హాజరు కాకపోవడంతోనే ఆయన కూడా పార్టీ వీడతారన్న సంకేతాలొచ్చాయి.