అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా.. తాజాగా, శనివారం బీజేపీ నుంచి మరో ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ పులిమామిడి రాజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డిలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జీ, మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నారాయణపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నారాయణపేట మున్సిపాలిటీ వైఎస్ ఛైర్మన్ హరినారాయణ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హరినారాయణ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమైంది.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ పై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ పై మంథని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మధుకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.