సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే బీజేపీ ఖాతాలో తొలి విజయ వచ్చి చేరింది. గుజరాత్ లోని సూరత్ స్థానం ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి పోటాగా కాంగ్రెస్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషణ తిరస్కరణకు గురైంది. దీంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ది ఆయనకు సర్టిఫికేట్ అందించారు.
గుజరాత్ లోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున నీలేశ్ కుంభనీ ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు. అయితే దాన్ని పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారం ఆదివారం నీలేశ్ కుంభనీ నామినేషన్ ను తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన ఆర్పో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
నీలేశ్ కుంభనీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ దాఖలు చేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. అయితే ఈ సూరత్ స్థానంకు వీరితో పాటుగా మరో 8 మంది అభ్యర్థిగా నామినేషన్లను దాఖలు చేశారు. కాగా, వారంతా నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం.. వారు దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకొని పోటీ నుంచి వైదొలగతున్నట్లు ప్రకటించారు. అయితే నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో బీఎస్పీ అభ్యర్థి కూడా ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి అవ్వడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం ఈ స్థానంలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీంతో ప్రధాని మోదీకి సూరత్ తొలి విజయాన్ని అందించింది అంటూ.. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, గుజరాత్ లోని మొత్తం 26 లోక్ సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.