నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్..

Spread the love

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని నివాసంలో ముందుగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తన కుటుంబ సభ్యులు, సన్నిహుతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో బయల్దేరి వెళ్లిన ఆయన.. రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.

 

పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ తీశారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేశారు. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ ముందుకు సాగారు.

 

నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి చమర గీతం పాడేలా ఈ నామినేషన్ వేశానని జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనని ఆశీర్వదించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు.

 

ఏపీ ప్రజల ప్రయోజనాలు మేరకే ఎన్నికల్లో కూటమిగా వెళ్తున్నామని జనసేనాని స్పష్టం చేశారు. పొత్తుల వల్ల జనసేన నేతలు త్యాగాలు చేశారని అన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో తన మాటను గౌరవించి.. తన మీదున్న ప్రేమతో అభ్యర్థులు విత్ డ్రా అయ్యారని తెలిపారు. వర్మ కు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

 

కాగా పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. జనసేనాని 5 ఏళ్ల సంపాదన రూ. 114. 76 కోట్లు కాగా.. ట్యాక్స్ రూపంలో రూ. 73.92 కోట్లు చెల్లించారు. రూ. 20 కోట్లు విరాళాలు అందజేయగా.. రూ. 64.26 కోట్లు అప్పులున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *