ఇక బీజేపీ వంతు, వారానికి మూడు, సిద్ధిపేటకు 25న అమిత్ షా..

Spread the love

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. విపక్ష బీఆర్ఎస్ అడపా దడపా హంగామా చేస్తోంది. ఇక బీజేపీ అయితే ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఆ పార్టీది. ముఖ్యనేతలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నారు. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న బీజేపీ.. పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు.

 

బహిరంగ సభలు, ముఖ్యనేతలు ఇప్పటివరకైతే ఎవరూ కనిపించలేదు. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్న సందర్భాలు ఇప్పటివరకు లేవు. ఎన్నిలకు కేవలం రెండువారాలు ఉండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టింది. వారానికి ఎలాగ లేదన్నా మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 25న కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

 

సిద్ధిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. మెదక్ నుంచి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. ఈ సభ తర్వాత చెవెళ్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌, వరంగల్‌లో భారీగా సభలకు ప్లాన్ చేస్తోంది. అయితే వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉండడంతో తేదీల ప్రకటన కాస్త ఆలస్యమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో మిగతా సభలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

ఈ క్రమంలో అధికార కాంగ్రెస్- బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుందని భావిస్తున్నారు నేతలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయ్యిందని అంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నది కొందరి వాదన. బీజేపీ టార్గెట్ అంతా బీఆర్ఎస్‌పైనే ఉంటుంందని కమలనాధులు చెబుతున్నమాట. వాళ్లపై చేస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తమవైపు తిరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి రానున్న రెండువారాలు బీజేపీకి కీలకమన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *