తెలంగాణ రాములమ్మ ఎక్కడ? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె ఎక్కడున్నారు? లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా, ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రచారంలో ఎందుకు కనిపించలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది అభిమానులను వెంటాడాయి.. ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెపై వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేశారు విజయశాంతి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సోషల్మీడియా ద్వారా తెలిపారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వర్గం.. ప్రజల కోసం ఆ దిశగా పని చేస్తున్నారని రాసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని మనసులోని మాటను బయటపెట్టారు. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం వైపు కంటే.. ప్రజల వైపు ఉండటం తన ధోరణి అని కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. తిరుగుబాటు సినిమా పాత్రల ప్రేరణ ఇందుకు కారణం కావచ్చన్నారు. కొంతమంది విమర్శించినా ఎందుకో అదే విధానం తనను ముందుకు నడిపిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికార పక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవం ఏమోనని రాసుకొచ్చారు. మొత్తానికి రాములమ్మ మేసెజ్తో కౌంటర్లు వేసే వాళ్ల నోటికి తాళం పడినట్లైంది.