కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థత నుంచి కోలుకున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మహారాష్ట్రలోని అమరావతిలో మధ్యాహ్నం 12:30 గంటలకు, షోలాపూర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
“రాహుల్ గాంధీ రేపు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించనున్నారు. ఆయన అమరావతి లోక్సభలో మధ్యాహ్నం 12:30 గంటలకు, షోలాపూర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు” అని రమేష్ X లో తెలిపారు.
కాగా స్వల్ప అస్వస్థతతో రాహుల్ గాంధీ ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. వయనాడ్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురికావడంతో కేరళలో తన కార్యక్రమాలను విరమించుకున్నారు. అటు రాంచీలోని ఇండియా కూటమి ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనేత దూరమయ్యారు. దీంతో ఈ కూటమిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. మధ్యప్రదేశ్లోని సాత్నా నియోజకవర్గంలో ప్రచారం ముగించుకున్న ఖర్గే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్నారు.