భారత్ పై విషం చిమ్ముతోన్న విదేశీ మీడియాపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఫైరయ్యారు. భారత్ లో ఎన్నికల గురించి సరైన సమాచారం లేకుండానే విదేశీ మీడియా.. విమర్శలు చేయడం తగదన్నారాయన. పాశ్చాత్య మీడియా మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ధ్వజమెత్తారు. భారత ఎన్నికలు, రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలన్న తపనతో ఇష్టారాజ్యంగా కథనాలు రాయడంపై మండిపడ్డారు.
నిజానికి విదేశాల్లో జరిగే ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ కంటే.. భారత్ లో నమోదయ్యే ఓటింగ్ శాతమే ఎక్కువని మంత్రి ఎస్. జై శంకర్ తెలిపారు. భారత్ ఎన్నికల వ్యవస్థలో విదేశీ మీడియా భాగమవ్వాలనుకుంటోందని, ఆ ఆలోచనలకు చెక్ పెట్టాలని జై శంకర్ పేర్కొన్నారు.
కాగా.. భారత్ లో ఎన్నికల కవరేజీకి తనకు అనుమతివ్వలేదని ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్ట్ అవని దియాస్ ఆరోపించారు. ఏప్రిల్ 20వ తేదీతో తన వీసా గడువు ముగుస్తుండగా.. గడువు పెంచేందుకు నిరాకరించినట్లు ఆరోపించింది. అవని దియాస్ చేసిన ఆరోపణలను అధికారిక వర్గాలు కొట్టిపారేశాయి. ఏప్రిల్ 18న ఆమె వీసా పర్మిట్ కు ఫీజు చెల్లించగా.. జూన్ వరకూ పొడిగించినట్లు చెప్పారు. అవని దియాస్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె తనంతట తానే ఏప్రిల్ 20న దేశం వదిలి వెళ్లారని పేర్కొన్నారు.