గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని అధికారులు లోనికి అనుమతించలేదు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్న కారణంగా..ఆలస్యంగా నామినేషన్ వేయడానికి వచ్చిన దళిత బహుజన పార్టీ అభ్యర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేయడానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో నోడల్ అధికారి నామినేషన్ వేయడానికి అనుమతించలేదు. నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..మాతంగి హనుమయ్య నోడల్ అధికారి కాల్లను మొక్కారు. అయినప్పటికీ సదరు అధికారి నామినేషన్ స్వీకరించకపోవడంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగారు.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గానూ 547 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 13 న పోలింగ్, జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.