ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..

Spread the love

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే డీజీపీని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని అందులో పేర్కొంది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ను ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వారికి సంబంధించినటువంటి ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపాలని సూచించింది.

 

ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు(1989 బ్యాచ్), మాదిరెడ్డి ప్రతాప్(1991 బ్యాచ్), హరీష్ కుమార్ గుప్తా(1992 బ్యాచ్) పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని నూతన డీజీపీగా ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం.

 

కాగా, ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఈసీకి వారు ఫిర్యాదు చేయగా, వాటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పలువురు ఉన్నతాధికారులపై కూడా ఈసీ బదలీ వేటు వేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *