ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు పేరు చెప్పనక్కర్లేదు. పౌరుషానికి కేరాఫ్గా చెబుతారు. మాచర్ల పేరు చెబుతే చాలా ఫ్యాక్షన్ దారుణాలు గుర్తు కొస్తాయి. ఇదంతా ఒకప్పుటి మాట… ఇప్పుడూ అక్కడక్కడ ఉన్నాయనుకోండి. కాకపోతే మునుపటి మాదిరిగా లేవన్నది స్థానికులు చెబుతున్నమాట. అక్కడి రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు.
అసలు విషయానికి కొద్దాం. బుధవారం రాత్రి మాచర్ల నియోజకవర్గంలోని శిరిగిరిపాడు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ టీడీపీ కేడర్ రాళ్ల దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలియగానే వైసీపీ కేడర్ అలర్టయ్యింది. వెంటనే పిన్నెల్లి మద్దతుదారులు మాచర్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వైసీపీ పిన్నెల్లి అనుచరులు జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయడపడ్డారు. సరిగ్గా రెండేళ్ల కిందట అంటే సరిగ్గా 31 అక్టోబర్, 2023న టీడీపీ నేతలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ-టీడీపీ శ్రేణులు ఎదురుపడడంతో ఘర్షణలు చేటు చేసుకున్నారు. అంతేకాదు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన పలువురు నేతల ఇళ్లు, కార్లను తగలబెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలైంది. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి తెలుసుకునేందుకు విజయవాడ నుంచి బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వంటి నేతలు మాచర్లకు వెళ్లారు. మెయిన్రోడ్డులో వారి ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ దాడిని టీడీపీ ఖండించింది కూడా. అంతేకాదు చంద్రబాబు సైతం డీజీపీ ఆఫీసు ముందు బైఠాయించిన విషయం తెల్సిందే.