గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం గుప్పించారు. విశాఖ ప్రజాగళంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ ప్రజలు చాలా తెలివైన వారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో నగర వాసులు ఎంతో ముందుచూపుతో విజయమ్మను ఓడించారని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చాక రాజకీయ రౌడీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలకు విశాఖ ఆస్తులపైనే మక్కువని.. ప్రజలపై కాదని తేల్చిచెప్పారు. వారు విశాఖలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. తన జీవితంలో తప్పు చేయలేదని.. అందుకే ఎవరికి భయపడనని టీడీపీ బాస్ స్పష్టం చేశారు. జైలులో ఉన్నప్పుడు తనని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హింసించారని.. అనేక ఇబ్బందులకు గురిచేశారని.. మానసికంగా వేధించారని అన్నారు.
సొంత చెల్లి చీర రంగు గురించి మాట్లాడే అన్నయ్య ఉంటాడా అని చంద్రబాబు సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు. ఇక కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనేని అన్నారు. కేంద్రంలో మోదీ గ్యారంటీలు ఉన్నాయని.. రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఉన్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో సర్వనాశనం చేశారని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామన్నారు.